Friday, February 26, 2010

కలలే నిజమైతే

పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒకటి చెపుతాను, ఇది చెన్నపట్నమని మన పెద్దలు ఎంతో ఇష్టంగా పిలుచుకునే చెన్నై కి వెళుతుండగ జరిగింది.

అవి వేసవిసెలవలు కవడంతో అమ్మ చెన్నై కి వెళ్ళాలని ప్లాన్ వెసింది, అలానే ఓ సాయంత్రం చెన్నైకని బస్సులో బయలుదేరాము. బస్సు నెల్లూరు దాటుతుండగ సూర్యుడు కూడా చిన్నగా కిందకు జారుకున్నాడు, నేను కిటకీ ప్రక్కన ఉన్న సీటులో కూర్చుని బయటకేసిచూస్తూఉన్నాను, ప్రపంచం నుండి దూరంగా పడేసినట్లు దరిదాపులలో అంతా చీకటిగా ఉన్న ఆ రోడ్డు కేసి చూస్తూ (భారతదేశ ముఖ్యపట్టణాలను కలుపుతూ ఉండే ఓ నాలుగు జాతీయరహదారులను ఎంతగానో ఆధునీకరించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ గా ఇపుడు పిలుస్తున్నారు, ఈ మార్గము అప్పటికి మామూలుగానే ఉంది) చిన్నగా కలలలోకి జారుకున్నాను, ఆ కలలో హీరో నేనే, హీరో అంటే ఊరికే ఉండకూడదు కదా, విలన్ ని కొట్టాలి, అలానే కొట్టాను. ఇంకా హీరోయిన్ కూడా ఉండాలి కదా, ఉంది(ఆ రోల్ ని శ్రీదేవి పోషించిందిలే), విలన్ ని కొట్టి చివరికి నేను నెగ్గి ఇంకా కల continue అవుతుండగా ఎదో శబ్దం వచ్చి నిద్రలేచాను, బస్సు ఆగివుంది, ఎవరో నలుగురు వ్యక్తులు ఎక్కారు, బస్సు మామూలుగానే కదిలేసింది, మళ్ళీ నేను నిద్ర లోకి జారుకుంటుండగా ఆ నలుగురు ఒక్కసారిగా లేచి కత్తులు చూపుతూ మా అందరిదగ్గరా ఉన్న డబ్బులు యివ్వమని అరిచారు, ఆ నలుగురిలో ఒకడు నడిచే క్రమంలో ఓ బ్యాగు అడ్డుపడటంతో పట్టుతప్పి కిందపడ్డాడు, వాడిని లేపే క్రమంలో ఒకడు, వారిద్దరిని చూస్తూ మరొక ఇద్దరూ ఉండిపోయారు, ఇంతలో ఓ ఇద్దరు ప్రయాణికులు దైర్యం చేసి తేరుకొని నించొని ఉన్న ఇద్దరు దొంగల్నితోసారు, వారు కిందపడ్డారు, దీనితో దైర్యం తెచ్చుకున్న మిగిలిన ప్రయాణికులు దొంగలపై ఎదురు తిరిగారు, నేను ఎందుకు ఊరకనే ఉండాలి అని నేను లేవబోయాను, ఇంతలో అమ్మ చూసి "ఒరేయ్! అదనప్రసంగిలా లేస్తున్నావేంటి, కూర్చో" అని అనేసరికి కూర్చుండిపోయాను. చివరికి మా ప్రయాణికులదే పైచేయి అయేసరికి దొంగలు ఊరకుండిపోయారు, ఆ ఇద్దరు ధీరోద్దాతులను పొగడ్తలలో ముంచెత్తారు.

కలలుకని వాటిని నిజం చేసుకొండి అని ఓ మహానుభావుడు చెప్పాడు, కాని ఇక్కడ నా ప్రమేయం లేకుండానే నాకొచ్చిన కల అటూఇటుగా నిజం అయిపోయింది.